భారత మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ
స్వర్గీయ పీవీ నరసింహారావు స్మార‌కార్థం ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీవీ శత జయంతిని పురస్కరించుకొని ఆయన గౌరవార్థం తపాళ బిళ్లను విడుదల చేయాలని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కోరినట్లు తెలిపారు. తన విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకొని పీవీ పోస్టల్ స్టాంప్ విడుదలపై సానుకూల నిర్ణయం తీసుకుంద‌ని తెలిపారు.

ఇందుకు ప్రధాని మోడీ, కేంద్ర సమాచార శాఖ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పీవీ నరసింహారావు దూర దృష్టి, సంస్కరణలు, సౌత్ ఈస్ట్ ఆసియాతో భారత్ వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేశాయని చెప్పారు. భారత ఆర్థిక సంస్కరణల పితగా పీవీ నరసింహరావును అభివర్ణించారు.

పీవీ చేసిన సేవలను భవిష్యత్ తరాలకు తెలపాలన్న యోచనతోనే పీవీ పోస్టల్ స్టాంప్ విషయంలో చొరవ చూపినట్లు వెల్లడించారు. త్వరలో భారత ప్రభుత్వం పీవీ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేస్తుందని చెప్పారు. ఇది దేశానికి ఆయ‌న‌ చేసిన సేవలను గుర్తిస్తూ, గౌరవ చిహ్నంగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.