వర్షపు నీరు నిల్వ లేకుండా చూడండి కమిషనర్ వై.ఓ నందన్
వర్షపు నీరు నిల్వ లేకుండా చూడండి కమిషనర్ వై.ఓ నందన్
నెల్లూరు, [కార్పోరేషన్], రవికిరణాలు జూలై 18 :
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని కమిషనర్ వై.ఓ నందన్ తెలిపారు.
పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక కె.వి.ఆర్ పెట్రోల్ స్టేషన్ కూడలి సమీపంలోని వీధుల్లో కమిషనర్ శుక్రవారం పర్యటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రధాన రోడ్లను క్రమంతప్పకుండా శుభ్రం చేయాలని, అన్ని డివిజనుల్లో ఇండ్ల చుట్టూ, ప్రాంగణాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకునే విధంగా గృహాల యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి వారి ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా హెచ్చరిక బోర్డులతో సూచనలు ఇవ్వాలని వెల్లడించారు. వర్షపు నీరు ప్రవహించేందుకు వీలుగా అన్ని డ్రైను కాలువల్లో పూడికతీత, మురుగు తొలగింపు పనులను ప్రతిరోజూ చేపట్టాలని ఆదేశించారు.
దోమల ఎదుగుదలకు దోహదపడే మంచినీటి సరఫరాలో లీకేజీ ప్రాంతాలు, వాడి పడేసిన టైర్లలో నిల్వ ఉండే నీరు, బహిరంగ ప్రదేశాల్లో డంప్ చేసిన ఖాళీ కొబ్బరి బోండాలలో నిల్వ ఉండే వర్షపు నీరు, పూల కుండీలు, వాడకంలో లేని నీటి తొట్లు, బావులపై ప్రజలందరికీ చైతన్యం కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ శానిటేషన్ విభాగం సూపర్ వైజర్లు, ఇన్స్పెక్టర్ లు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.