ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచాలి: ఎన్ఎంయూఏ డిమాండ్
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచాలి: ఎన్ఎంయూఏ డిమాండ్
రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట :-
సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్ఎంయూఏ) నాయకులు కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీఆర్పీ రాఘవ కుమార్ను కోరారు. మంగళవారం సూళ్లూరుపేట డిపోను ఈడీ టీఆర్పీ రాఘవ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రీజియన్ మేనేజర్ జగదీష్, సీటీఎం విశ్వనాథ్, సీఎంఈ బాలాజీ కూడా పాల్గొన్నారు.
తనిఖీ సందర్భంగా ఎన్ఎంయూఏ నాయకులు డిపో సమస్యలు, ప్రయాణికుల ఇబ్బందులు, సిబ్బంది అవసరాలపై వినతిపత్రం సమర్పించారు. నాయుడుపేట బస్టాండ్లో ప్రైవేట్ వాహనాల చొరబాటు అధికంగా ఉండటంతో ఆర్టీసీకి ఆదాయం తగ్గుతోందని తెలిపారు. తిరుపతి, నెల్లూరు, చెన్నై మార్గాలకు నాయుడుపేట ప్రధాన జంక్షన్ కావడంతో అక్కడ ట్రాఫిక్ సూపర్వైజర్ లేదా బస్టేషన్ మేనేజర్ను నియమించాలని కోరారు.
సూళ్లూరుపేట డిపో గ్యారేజ్ ఆవరణలో గుంతలు ఎక్కువగా ఉండటంతో వర్షాకాలంలో బురద, ఎండాకాలంలో దుమ్ము కారణంగా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అక్కడ సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సూళ్లూరుపేట ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, సెజ్, షార్, శ్రీ సిటీ సంస్థల కారణంగా ప్రయాణికుల రద్దీ పెరిగిందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న ‘శ్రీ శక్తి’ పథకం వల్ల కూడా బస్సులకు డిమాండ్ అధికమైందన్నారు. దీంతో సూళ్లూరుపేట–తిరుపతి మార్గంలో ప్రతి 20 నిమిషాలకు, నెల్లూరు–సూళ్లూరుపేట మార్గంలో ప్రతి 30 నిమిషాలకు బస్సులు నడపాలని కోరారు.
అలాగే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ధ్రాక్షారామం, విశాఖపట్నం, తిరుమల వంటి దూరప్రాంతాలకు కొత్త బస్సు సర్వీసులు ప్రారంభించి తగిన సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. డిపోలో ప్రహరీ గోడ కూలిపోయి చాలా కాలమైందని, టవర్ లైట్లు పనిచేయడం లేదని, వాటిని వెంటనే మరమ్మతు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిపో సెక్రటరీ ఎం. శేఖర్, డిపో అధ్యక్షుడు కే. కరుణాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే షాజహాన్, వైస్ ప్రెసిడెంట్ ఆనంద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సీహెచ్ వెంకటయ్య, జాయింట్ సెక్రటరీ రాదయ్య, సుబ్బయ్య, పి.ఎస్. మన్యం, కోటయ్య, గోపి, ఎస్కే కాలేషా, కన్వీనర్ పి. రమణయ్య, అశోక్ రెడ్డి, జిల్లా నాయకుడు ఏ.ఎస్. మన్యం, గ్యారేజ్ నాయకులు కల్యాణకృష్ణ, శశి, సునీల్, మూర్తి, టైర్ శ్రీనయ్య, రఫీ, మాధవ్, అభి తదితరులు పాల్గొన్నారు.