ప్రజలకు నిత్యం నరకం చూపిస్తున్న రైల్వే గేటు
సూళ్లూరుపేట ప్రజలకు నిత్యం నరకం చూపిస్తున్న రైల్వే గేటు.
అండర్ బ్రిడ్జ్ పనుల జాప్యంతో ప్రయాణికులు ఆగ్రహం.
రైల్వే అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికుల పాలిట శాపం..??
రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
పట్టణంలో రైల్వే శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజల సహనాన్ని పరీక్షిస్తోంది.
పట్టణంలోని ప్రధాన రైల్వే గేటు వద్ద నిర్మించాల్సిన అండర్ బ్రిడ్జ్ పనులు సంవత్సరాలుగా నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రజల సమస్యలను పట్టించుకోని అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.
2018-2019 సంవత్సరంలో భారీ అంచనాలతో ప్రారంభించిన రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఇప్పటివరకు పూర్తి కాకపోవడం ప్రజల్లో తీవ్ర అసహనానికి కారణమవుతుంది.
పనులు మొదలుపెట్టి మధ్యలోనే నిలిపివేయడంతో రైల్వే గేటు వద్ద ప్రతిరోజూ భారీ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. రైల్వే గేటు మూసివేసిన ప్రతిసారి రెండు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోతుండటంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు గంటలపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అత్యవసర సేవల వాహనాలు సైతం ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం ఆందోళన కలిగిస్తోంది.
అండర్ బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా పూర్తవుతుందని అప్పట్లో అధికారులు హామీలు ఇచ్చినా, సంవత్సరాలు గడుస్తున్నా పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పటికీ పనులు ఎందుకు నిలిచిపోయాయో అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సమస్యపై పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపార సంఘాలు, సామాజిక సంస్థలు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందన లేకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైల్వే శాఖ అధికారులు ప్రయాణికుల సమస్యలను వెంటనే పరిష్కరించి అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.