నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్
నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్.
14 మందికి రూ.23.63 లక్షల చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే.
నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.5.08 కోట్లకు పైగా వైద్య సహాయం.
రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట :-
సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజల ఆరోగ్య భద్రతకు తానేనంటూ ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ మరోసారి నిరూపించారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ 14 మంది లబ్ధిదారులకు రూ. 23,63,164/- విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ ఎఫ్) చెక్కులను ఆమె స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.విజయశ్రీ మాట్లాడుతూ, ఆర్థిక సమస్యల వల్ల ఏ పేదవాడు వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిధిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 521 మంది లబ్ధిదారులకు రూ. 5,08,65,165/- మేర ముఖ్యమంత్రి సహాయ నిధిని అందించి ప్రజాపక్షపాత వైఖరిని చాటుకున్నామని గుర్తుచేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలను చేర్చడమే తన ప్రథమ కర్తవ్యమని ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చొరవపై లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.