యువత మేలుకో.. వ్యసనాలకు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకో: సీఐ మురళీకృష్ణ

రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట:-

నాయుడుపేటలో జరుగుతున్న శ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర నేపథ్యంలో సూళ్ళూరుపేట పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం నిఘాను ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా సీఐ ఎం. మురళీకృష్ణ యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. యువత క్షణికానందం కోసం గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు. గంజాయి రవాణా చేసినా, సేవించినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని, ఒకసారి కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగాలకు, విదేశీ ప్రయాణాలకు శాశ్వతంగా ఆటంకం కలుగుతుందని స్పష్టం చేశారు. "మీ ఇంట్లో మీ కోసం ఎదురుచూసే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. వేగపు మోజులో బైక్‌లపై ఇష్టానుసారంగా విహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు" అని ఆయన హితవు పలికారు.


ముఖ్యంగా స్థానిక యువత ఉపాధిపై దృష్టి సారించాలని సీఐ సూచించారు. మన ప్రాంతంలో అనేక పరిశ్రమలు అందుబాటులోకి వచ్చాయని, సన్మార్గంలో నడిచి ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరారు. మారాలనుకునే యువతకు, ఉద్యోగ అవకాశాల విషయంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే ఎండల తీవ్రత దృష్ట్యా ఈత కోసం చెరువులు, బావుల వద్దకు వెళ్లవద్దని, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం తీరని వేదనకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పౌరులుగా మెలుగుతూ, క్రమశిక్షణతో తమ జీవితాలను సెట్ చేసుకోవాలని సీఐ మురళీకృష్ణ పిలుపునిచ్చారు.