నెల్లూరులో 100 పడకలతో ఈఎస్‌ఐ హాస్పిటల్‌ నిర్మాణం

- లోక్‌సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారి ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం


నెల్లూరు నగరంలో 100 పడకలతో ఈఎస్‌ఐ హాస్పిటల్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరండ్లజే వెల్లడించారు. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారి ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ESI లబ్ధిదారులకు వైద్య సేవలను అందించడానికి నెల్లూరు జిల్లాలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడానికి మార్చి 2019లో ప్రభుత్వం ఆమోదం తెలిపిందనేది నిజమేనా అని ఆరా తీశారు. ఆసుపత్రి కోసం జరిగిన భూసేకరణ, సిబ్బంది వసతి గృహాల కోసం అదనంగా ఒక ఎకరం భూమిని కేటాయించడం వాస్తవమేనా అని సమాచారం అడిగారు. టెండర్ ప్రక్రియ ప్రారంభంలో జరుగుతున్న జాప్యానికి గల కారణాలు, హాస్పిటల్‌ నిర్మాణానికి పట్టే సమయం వంటి వివరాలు కోరారు. 

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నలకు కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి సుశ్రీ శోభా కరండ్లజే సమాధానం ఇచ్చారు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండు 100 పడకల ESI ఆసుపత్రులను ఏర్పాటు చేయడానికి "సూత్రప్రాయంగా" ఆమోదం తెలిపిందన్నారు. వీటిల్లో శ్రీ సిటీలో ESI 100 పడకల ఆసుపత్రి విషయంలో, సిబ్బంది క్వార్టర్లతో సహా 5 ఎకరాల భూమిని సేకరించారని, దీనికి 27.06.2025న జరిగిన 196వ సమావేశంలో ESI కార్పొరేషన్ ఆమోదించిందన్నారు. ఇక నెల్లూరు కేంద్రంగా మరో 100 పడకల ఆసుపత్రిని ESIC యాజమాన్యంలోని 2 ఎకరాల స్థలంలో నిర్మించనున్నారని వెల్లడించారు. ఇక్కడ సిబ్బంది క్వార్టర్ల కోసం అదనంగా 1 ఎకరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ భూమి అనుకూలతలు, ఇతర అంశాలు, టెండర్ల ప్రక్రియపై ESIC పరిశీలిస్తోందన్నారు