నెల్లూరు జిల్లా

జిల్లా లో జంతు హింస జరగకూడదు... కలెక్టర్ శుక్లా



నెల్లూరు జిల్లాలో కోడిపందాలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో జిల్లా జంతు హింస నివారణ కార్యవర్గ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో కోడిపందాలు, ఎడ్లపందాలను పూర్తిస్థాయిలో అరికట్టాలన్నారు. జంతువులను హింసకు గురిచేసే విధంగా ఏ విధమైన పోటీలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  గ్రామస్థాయి, మండలస్థాయి, డివిజనల్‌ స్థాయిలో రెవెన్యూ, పోలీసులతో బృందాలను ఏర్పాటుచేసి జాయింట్‌గా తనిఖీలు నిర్వహించాలన్నారు. కోడి పందాలు నిర్వహించే ప్రదేశాలను ముందుగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా కోడిపందాలను ప్రోత్సహించినా, నిర్వహించినా గేమింగ్‌ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేయాలని ఏఏస్పీకి సూచించారు.  పల్లెల్లో ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా సంక్రాంతి పండుగను ప్రశాంతంగా నిర్వహించుకునేలా చూడాలన్నారు. అనంతరం కోడిపందాలు అరికట్టేందుకు అవగాహన పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయక్, ఏఎస్పీ సిహెచ్‌ సౌజన్య, డిఆర్ఓ విజయ్ కుమార్, కమిషనర్‌ నందన్‌, జడ్పీ సిఇవో శ్రీధర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వసుమతి, ఐఅండ్‌పిఆర్‌ డిడి వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు...