ఈ సారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు...వాతావరణ శాఖ గుడ్ న్యూస్
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. ఈ సారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు
ఓవైపు ఎండలు, మరోవైపు వానలు, సూపర్ ఎల్నీనో అంటూ వస్తున్న వార్తలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 2026 నైరుతి రుతుపవనాల కాలానికి సంబంధించి ఐఎండీ ఈరోజు తన తుది దీర్ఘకాలిక వాతావరణ అంచనాలను (Long-range forecast) విడుదల చేసింది. ఈ సీజన్లో తెలంగాణలో సాధారణం, అంత కంటే ఎక్కువ (Normal to Above Normal) వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ముఖ్యంగా రాజధాని హైదరాబాద్తో కూడిన మధ్య తెలంగాణ ప్రాంతాల్లో ఈసారి భారీ వర్షాలు (Excess rainfall) కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లోని మధ్య కోస్తా ప్రాంతాల్లో కూడా రుతుపవనాల ప్రభావం అనుకూలంగా ఉండనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాలు ఉభయ రాష్ట్రాల్లోని వ్యవసాయ రంగానికి, తాగునీరు, భూగర్భ జల వనరుల పునరుద్ధరణకు ఎంతో ఊరటనిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 'సూపర్ ఎల్ నినో' ఆందోళన
తెలుగు రాష్ట్రాలకు సానుకూల అంచనాలు ఉన్నప్పటికీ, దేశవ్యాప్త పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగానే ఉండేలా కనిపిస్తున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న 'సూపర్ ఎల్ నినో' (Super El Niño) ప్రభావం కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇది దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. వాతావరణంలో నెలకొన్న ఈ అనిశ్చితి దృష్ట్యా, లభించే ప్రతి నీటి చుక్కను ఆచితూచి, పొదుపుగా వాడుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.