గత ప్రభుత్వంలో ఉన్నవి మూసేశారు స్టార్ట్ చేసినవి ఆపేశారు 

పరిపాలన అంటే ప్రజలకు ఏమి కావాలో తెలుసుకొని అది చేయడం 

నెల్లూరు 15వ డివిజన్లో రౌండ్ తూము వద్ద రోడ్డును ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ 

గత ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో మండిపాటు 

రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారంటూ ధ్వజం 

సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక పాలనతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న రాష్ట్ర అభివృద్ధి 

జూన్ 2026 నాటికి నెల్లూరులో డ్రైన్లు అన్ని పూర్తి చేస్తాం 

రైల్వే ట్రాక్ ల వద్ద బ్రిడ్జిల ఏర్పాటుకు ప్రతిపాదనలు 








నెల్లూరు [అర్బన్], రవికిరణాలు ఆగష్టు 30 : 

పరిపాలన అంటే ప్రజలకు ఏం కావాలో అది చేయడమేనని, గత ప్రభుత్వం మాదిరిగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం కాదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. శనివారం నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్లో రౌండ్ తూము వద్ద రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. డివిజన్ కి విచ్చేసిన మంత్రికి స్థానిక ప్రజలు, టిడిపి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 45వ డివిజన్ నుంచి 15, 16 డివిజన్లకు రాకపోకలు సాగించేందుకు అనువుగా రౌండ్ తూము వద్ద రోడ్డును ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ఇక్కడ రౌండ్ తూము నిర్మించాలని 2014 -19 టిడిపి హాయంలోనే ప్రతిపాదనలు చేసామన్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వం కేవలం టిడిపి హయాంలో చేపట్టిన పనులను నిలుపుదల చేయాలని మా మీద కక్షతో రౌండ్ తూము వద్ద పనులను ఆపేసారని మండిపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి రౌండ్ తూము వద్ద పనులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు.తద్వారా 15, 16 డివిజన్ల ప్రజలు 45వ డివిజన్ లోకి వచ్చేందుకు రాకపోకలకు అనువుగా ఉంటుందని తెలిపారు. పరిపాలన అంటే ప్రజల అవసరాలను తెలుసుకొని సేవ చేయడమేనని మంత్రి హితబోధ చేశారు. టిడిపి హయాంలో చేపట్టిన పనులన్నీ మూసేశారని, అభివృద్ధి పనులన్నీ ఆపేసారని మంత్రి మండిపడ్డారు. ప్రస్తుతం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం హయాంలో నగరంలో సుపరిపాలన కొనసాగుతుందన్నారు. ఆరు మదర్ వాటర్ ప్లాంట్ ద్వారా ఆరు లక్షల లీటర్ల నీటిని త్వరలో ప్రజల ఇంటికి అందించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా నగరంలో మరికొన్ని బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ ల వద్ద కూడా అండర్ పాస్ బ్రిడ్జిల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఖజానా ఖాళీ చేసి 10 లక్షల కోట్ల మేర అప్పులు చేసి వెళ్లిపోయారని మంత్రి మండిపడ్డారు ప్రస్తుతం ప్రజలు కట్టే పనులన్నీ ఆ అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదన్నారు. అయినప్పటికీ విజనరి నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యూహాత్మక పరిపాలనతో రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలో జూన్ 2026 నాటికి డ్రైన్స్ పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు కాస్తంత సమయం ఇస్తే అన్నీ చేసి చూపిస్తామని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, నూడ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, 15వ డివిజన్ కార్పొరేటర్ గణేశం సుజాత వెంకటేశ్వర రెడ్డి, 15 ప్రెసెండిట్ చౌదరి, 16 డివిజన్ కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి, అధ్యక్షుడు సాయి, క్లస్టర్ ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.